|
|
ప్రాధమిక ఆసుపత్రులకూ ఇంటర్నెట్!
అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, మేజర్ గ్రామ పంచాయతీలకూ వర్తింపు
నిర్దేశిత గడువులోగా కనెక్షన్లు ఇవ్వాలని సూచన
రంగారెడ్డి, జులై 16 (ఫీచర్స్ ఇండియా): జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, మేజర్ గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ప్రణాళికలను సిద్దంచేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ యం.దానకిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేటులోని తన చాంబర్లో ఇంటర్నెట్ సదుపాయంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ టియస్యన్ఎల్ జిల్లాలోని ఒక్కో టెలిఫోన్ ఎక్సేంజ్ ద్వారా 31 కనెక్షన్లను ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని దీని వలన దాదాపు 500 నుండి 600 ఇంటర్నెట్ కనెక్షన్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. జిల్లాలోని 200 ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్లకు, 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, వసతి గృహాలకు, మేజర్ గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇంటర్నెట్ సౌకర్యం వలన పాఠశాలలోని విద్యార్థులకు సైన్స్ పాఠాలతో పాటు ఇతర విజ్ఞాన పరమైన విషయాలు తెలుసుకోగలుగుతారాని అన్నారు. అదే విధంగా కలెక్టరేటులో ఏర్పాటు చేసిన ఎడ్యూకేషన్ హెల్స్ లైన్ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా వీలు కలుగుతుందని అన్నారు. ఇందుకు సంబంధించి అయ్యే ఖర్చును రాజీవ్ విద్యా మిషన్ ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. ప్రాధమిక అరోగ్య కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హాజరును బయో మెట్రిక్ విధానం ద్వారా తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని, అదే విధంగా సంక్షేమ హాస్టళ్శ సిబ్బంది హాజరును కూడా తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని ఆయన అన్నారు. మండల కేంద్రాల గ్రామ పంచాయతీలకు ముందుగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిపిఓ ను కలెక్టరు ఆదేశించారు. అనంతరం మేజర్ గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలొ జిల్లా విద్యా శాఖాధికారి శ్రీహరి, డిపిఓ నాయక్, యన్ఐసి అధికారి కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
|
|
|