న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
పెండింగ్‌లో ఉన్న భూ వివాద కేసులపై ప్రత్యేక దృష్టి

పరిష్కారానికి కృషిచేయాలని రెవెన్యూ అధికారులకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి ఆదేశం
రంగారెడ్డి, జులై 16 (ఫీచర్స్ ఇండియా): జిల్లాలో సంవత్సరాలుగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న భూములకు సంబంధించిన కేసులపై రెవిన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం చేవెళ్శ డివిజనల్‌ కార్యాలయంలో వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులపై రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌కు సమీపంలోగల మండలాల్లో అధికంగా కేసులు పెండింగ్‌లో వున్నాయని వాటిపై ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన తెలిపారు. ప్రతి శనివారం ఏ కోర్టులో ఏ కేసులు పెండింగ్‌లో వున్నాయో వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టాలని ఆయన తెలిపారు. కలెక్టరేట్‌, ఆర్డీఓ స్థాయిలో పెండింగ్‌లో వున్న కేసుల వివరాలను కూడా సేకరించి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఆయా కేసుల వివరాలు ఇవ్వాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మొదటిగా కేసులు అధికంగా పెండింగ్‌లో వున్న శంషాబాద్‌ మండల కేసులపై సమీక్షిస్తూ పరిష్కరించుకొనుటకు కావలసిన న్యాయ సలహాలను తీసుకొని నెల రోజులలో వాటిపై తగిన నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారికి సూచించారు. శేరిలింగంపల్లి, బాలానగర్‌, మల్కాజిగిరి, మొయినాబాద్‌, చేవెళ్శ, దోమ తదితర మండలాలకు సంబంధించిన వివిధ కేసుల స్థాయిల వివరాలను కేసులవారీగా తెలుసుకొని పరిష్కరించే విధంగా అలాగే కౌంటర్లు వేయాల్సిన కేసులను కూడా ఆయన సమీక్షించారు. ఆయా కేసులకు సంబంధించి సంబంధిత రెవెన్యూ అధికారులకు గడువులను కూడా నిర్దేశించారు. సమావేశంలో పాల్గొన్న కోనేరు రంగారావు కమిటి జాయింట్‌ కమీషనర్‌ పార్వతీ సుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన అర్బన్‌ల్యాండ్‌ సీలింగ్‌ భూముల వివరాలు , రెగ్యులరైజ్‌ చేయని భూముల వివరాలకు సంబంధించి సిడిలను రెవెన్యూ అధికారులకు అందజేస్తున్నామని, వీటిని పరిశీలించి ఆయా రెవెన్యూ అధికారులు సీలింగ్‌ పరిధిలోకి వచ్చే భూములపై రెగ్యులరైజ్‌ చేసుకొని, ఆక్రమణ భూములపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ విషయమై స్థానిక మున్సిపల్‌ కమీషనర్లకు , రిజిస్ట్రేషన్‌ అధికారులకు సీలింగ్‌ భూముల వివరాలను ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో చేవెళ్శ ఆర్‌డిఓ రత్నకుమార్‌, యుఎల్‌సి సెక్షన్‌ ఆఫీసర్‌ రవీందర్‌రెడ్డి, లా ఆఫీసర్‌ సత్యనారాయణ, భూపరిరక్షణ ప్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డివిజినల్‌ స్థాయి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.