|
|
ప్రజల ఆశలు వమ్ముచేయొద్దు!
జిల్లా అధికారులకు కలెక్టర్ రాంశంకర్నాయక్ హితవు
ప్రజావాణి సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆదేశం
కర్నూలు, జులై 16 (ఫీచర్స్ ఇండియా): జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుండి ఎంతో ఆశతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ప్రజావాణికి వచ్చి వినతులు సమర్పిస్తారని, అందుకు అధికారులు వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు రాంశంకర్నాయక్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరు కార్యాలయంలో ప్రజావాణి వినతుల కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా వచ్చిన వినతులలో గోస్పాడు మండలం, యాళ్లూరు గ్రామానికి చెందిన తిమ్మయ్య భూపంపిణీ చేయాలని, పగిడ్యాల మండలం, నాగటూరు గ్రామానికి చెందిన కె.యాక్షయ్య వరద సహాయం అందించాలని, కల్లూరు మండలం శరీన్నగరుకు చెందిన మంగలి దస్తగిరి వికలాంగుల ఫించన్ మంజూరు చేయాలని, కర్నూలు నగరానికి చెందిన ముర్తుజాబేగం వితంతు ఫించను మంజూరు చేయాలని, అలాగే కర్నూలుకు చెందిన ఎస్. ముంతాజ్ బేగం తన భర్త మరణించారని ఏదైన ఆర్థిక సహాయం అందించాలని, వెల్దుర్తి మండలం, లక్ష్మినగర్కు చెందిన ఖాతూన్బీ రేషన్ కార్డును పునరుద్దరించాలని, కర్నూలు సున్నం వీధికి చెందిన గౌస్పీరా వికలాంగుల ఫించన్ మంజూరుచేయాలని, కర్నూలు ముజఫర్నగర్కు చెందిన సుధాకర్రావు మరి ఇతరులు తమ ప్రాంతంలో ఉర్దూ పాఠశాలను మంజూరు చేయాలని, కర్నూలు మాజీ జెడ్పి చైర్మన్ బత్తిన వెంకటరాముడు తుగ్గలి మండలం, రామలింగాయి పల్లెలో జెడ్పీ హైస్కూల్ మంజూరు చేయాలని, మరియు ఇంటి స్థలాలను మంజూరు చేయాలని కలెక్టరుకు వినతులు నివేదించారు. అలాగే కర్నూలు బుధవారపేటకు చెందిన డి. పుష్పవతి తెల్లరేషన్ కార్డును ఇప్పించాలని, కల్లూరు అబ్బాస్ నగర్కు చెందిన వై. పార్వతి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని, కల్లూరు మండలం, లక్ష్మీనగర్కు చెందిన వెంకట లక్ష్మమ్మ ఇంటి పట్టాను ఇప్పించాలని, అలాగే కె. రాజన్న ఇంటి స్థలం మంజూరు చేయాలని, కర్నూలు ముజఫర్నగర్కు చెందిన సుధాకర్రావు మరి ఇతరులు ప్రభుత్వ జూనియర్ కాలేజిని మంజూరు చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టరు రాంశంకర్ నాయక్కు వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి జాయింట్ కలెక్టరు బి. లక్ష్మికాంతం, డిఆర్ఒ సూర్యప్రకాష్, వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు, ప్రజావాణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
|